లాంగ్ గ్యాప్ తర్వాత.. రాజ్ న్యూస్ హెడ్గా మీడియాలోకి రీఎంట్రీ ఇచ్చిన రవి ప్రకాశ్ ఇక తన రేస్ మొదలుపెట్టారు. రెండు నెలల క్రితమే రాజ్ న్యూస్లో చేరినప్పటికీ.. పూర్తి స్థాయిలో ఛానెల్ ఆయన చేతిలోకి రాకపోవడంతో ఇన్నాళ్లు ఎలాంటి మార్పులు లేకుండానే నడిపించుకుంటూ వచ్చారు. రాజ్న్యూస్పై పాత మేనేజ్మెంట్కు డిసెంబర్ 31వరకు హక్కులు ఉండటంతో ఛానెల్లో ఆయన మార్క్ కనిపించలేదు. ఇప్పుడా గడువు పూర్తయ్యి.. రాజ్ న్యూస్ మొత్తం ఆయన హ్యోండోవర్లోకి వెళ్లింది. దీంతో రాత్రికి రాత్రే ఛానెల్ రూపు రేఖలు మారిపోయాయి. ముఖ్యంగా రాజ్ న్యూస్ లోగో మారిపోయింది. రూపాయిని పోలి ఉన్న R అనే అక్షరంతో ఆకర్షణీయంగా కొత్త లోగోను డిజైన్ చేశారు.
కంటెంట్ పరంగా ఇప్పటికే రాజ్ న్యూస్లో చాలా మార్పులు జరిగాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు నుంచే ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే వార్తలకే పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఇక పాత మేనేజ్మెంట్తో అగ్రిమెంట్ కారణంగా ఇప్పటిదాకా సిబ్బందిలో పెద్దగా మార్పులు, చేర్పులేం చేయలేదు. అయితే ఇప్పుడు ప్రక్షాళన మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన స్టాఫ్ రిపోర్టర్లలో కొందరిని మార్చినట్టుగా చెబుతున్నారు. అవుట్పుట్, ఇన్పుట్లో కూడా ఇన్నాళ్లు తక్కువ మంది సిబ్బందితోనే నడిపించుకొచ్చారట. ఇక ఇప్పుడు ఫుల్ప్లెడ్జెడ్గా వారి చేతిలోకి రావడంతో.. అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేసుకునేందుకు సిద్దమవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి మీడియాలో మళ్లీ రవిప్రకాశ్ స్టైల్ వార్తలు కనిపించే టైం అతి త్వరలో రాబోతోంది.
0 Comments